రాష్ట్రంలో కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ : మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ః హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లకు నియామక పత్రాలను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని, వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. 1331 మంది ఆయుష్ కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించామని తెలిపారు.
2014 నుంచి ఆరోగ్యశాఖలో 22,263 మందిని నియమించామని చెప్పారు. మరో 2 నెలల్లో కొత్తగా 9,222 పోస్టులు భర్తీ చేయనున్నామని వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్లో ప్రస్తుతం 54 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జూన్ నుంచి 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క ఏడాదిలోనే కొత్తగా 9 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని, ఒక్కో కాలేజీకి సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.