పియూష్ గోయల్ పై మండిపడ హరీశ్ రావు

ఎంతో ప్రాధాన్యత ఉంటేనే ఇంత మంది మంత్రులు వస్తారని వ్యాఖ్య

హైదరాబాద్ : కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని… ఇదే సమయంలో బీజేపీ నేతలకు మాత్రం సమయం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులను పట్టుకుని వారికి పని లేదు అని అంటారా? అని మండిపడ్డారు.

ఎంతో ప్రాధాన్యత ఉంటేనే ఇంత మంది మంత్రులు ఢిల్లీకి వస్తారని… తమ గురించి ఇంత దారుణంగా మాట్లాడే నైతికత మీకెక్కడిదని హరీశ్ ప్రశ్నించారు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని నిలదీశారు. మీకు తెలంగాణ రైతుల ఓట్లు కావాలి కానీ… వారి వడ్లు వద్దా? అని మండిపడ్డారు. తెలంగాణ వడ్లు ఎందుకు కొనరని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/