కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో బాల్య వివాహాలను అరికట్టం : మంత్రి కమలాకర్
హైదరాబాద్: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే పద్దులపై చర్చించనున్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేయడంతో తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టగలిగామని మంత్రి స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ రెండు పథకాల కింద 10 లక్షల 26 వేల 396 మంది లబ్ధి పొందారు. బీసీ సంక్షేమం ద్వారా 4,87,346 మంది, గిరిజన శాఖ ద్వారా 1,21,639 మంది, మైనార్టీ శాఖ ద్వారా 2,10,676, ఎస్సీ శాఖ ద్వారా 2,06,735 మంది లబ్ధి పొందారు. ఈ రెండు పథకాలకు మొత్తంగా రూ. 8,673.67 కోట్ల ఖర్చు చేయడం జరిగింది. బీసీ శాఖ ద్వారా రూ. 4,355 కోట్లు, గిరిజన శాఖ ద్వారా రూ. 975 కోట్లు, మైనార్టీ శాఖ ద్వారా రూ. 1,682 కోట్లు, ఎస్సీ శాఖ ద్వారా రూ. 1,660 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు అరికట్టగలిగామని చెప్పారు. ఈ విషయం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా తేలిందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/