దేవుడి పెళ్లి లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మాయం..అసలు ఏమైందంటే

దేవుడి పెళ్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ మాయమైంది. కాకపోతే కాసేపటికి మళ్లీ దొరకడం తో హమ్మయ్య అనుకున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. దేవుడి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవుడి కళ్యాణంలో పాల్గొన్న అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో జేబులు తడుముకున్న ఎర్రబెల్లి..జేబులో ఫోన్ లేకపోయేసరికి ఖంగారుపడ్డారు.

వెంటనే ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయిందంటూ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఎవరికైనా దొరికితే ఆలయ ఛైర్మన్ శ్రీధర్ రావుకు అప్పగించాలంటూ ప్రకటించారు. దీంతో.. మంత్రి ఫోన్ పోయిందన్న విషయం.. ఊరంతా పాకింది. చాలా సేపు వెతికి.. అక్కడి నుంచి మంత్రి తన కారు దగ్గరికి వెళ్లిపోయారు. తీరా చూస్తే మంత్రి ఫోన్ కార్ లోనే ఉంది. దేవాలయంలోకి వెళ్లే ముందు మంత్రి ఎర్రబెల్లి తన సెల్‌ఫోన్‌ను కారులోనే మరిచిపోయి వెళ్లారట. ఈ విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు.