ఏది మంచి ప్రభుత్వమో చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందిః మంత్రి ధర్మాన

చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లపైనే మొదట తుపాకీ పేలుస్తారన్న ధర్మాన

minister-dharmana-prasada-rao-criticizes-chandrababu

అమరావతిః మంత్రి ధర్మాన ప్రసాద రావు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే అని ఆరోపించారు. చంద్రబాబు కన్నా ముందే మనమే తుపాకీ పేల్చాలని వాలంటీర్లను ఉద్దేశించి అన్నారు. ఏది మంచి ప్రభుత్వమో చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందని, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లేనని స్పష్టం చేశారు. పౌరులకు ఉండే హక్కులన్నీ వాలంటీర్లకు ఉంటాయన్నారు.

శ్రీకాకుళం జిల్లా సత్యవాడలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు ఏపీలో పెరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. దేశమంతా పెరుగుతుంటే ఏం చేయగలమని ప్రశ్నించారు.

‘‘వాలంటీర్లు తెలివైన వారు కాబట్టి.. ప్రజలకు అవగాహన కల్పించాలి. వారిని సరైన దారిలో తీసుకెళ్లాలి. ఏ రాజకీయ పార్టీకి ఓటెయ్యాలో, ఏ పార్టీ మంచిదో వాలంటీర్లు చెప్పకూడదని ఎవరు అన్నారు? ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది. వాలంటీర్ కూడా పౌరుడే. చంద్రబాబు అధికారంలోకి వచ్చి తుపాకీ పేల్చేది వాలంటీర్లపైనే. అందుకే ముందు మనమే పేల్చాలి. మన దగ్గరా తుపాకీ ఉంది’’ అని అన్నారు.