బిజెపితో కలిసి వెళ్తామని ఎవరు చెప్పారు?
ముఖ్యమంత్రి- ప్రధాని భేటీని కొన్ని పత్రికలు హైలేట్ చేశాయి
అమరావతి: బిజెపితో వైఎస్సార్సిపి పొత్తుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. బిజెపితో సఖ్యతను అంటకట్టి వైఎస్సార్సిపికి ప్రజలను దూరం చేయాలని కొందరు తీవ్రంగా ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- ప్రధాని మోడీ భేటీని కొన్ని పత్రికలు హైలెట్ చేశారని మండిపడ్డారు. టిడిపి ఓడినప్పటి నుంచి వైఎస్సార్సిపిపై బురద జల్లే కార్యక్రమం చేస్తోందని విమర్శించారు. బిజెపి తో కలిసి వెళ్తామని ఎవరు చెప్పారని బొత్స ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి ఇన్ఛార్జ్ సైతం కలిసేది లేదంటున్నారని…తాము కలుస్తామని చెప్పలేదని బొత్స స్పష్టం చేశారు. వైఎస్సార్సిపి-బిజెపి కలిస్తే పవన్ కళ్యాణ్ బయటకు వెళ్లిపోతానని అంటున్నారని..ఆయనను ఎవరు కలవమన్నారు, ఎవరు వెళ్లామన్నారంటూ బొత్స ఎద్దేవా చేశారు. తాను అనని మాటను ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తుందని అన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడును రక్షించేందుకేనంటూ బొత్స ఆరోపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/