భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై క్షణాల్లోనే మాట మార్చిన మంత్రి ఆదిమూలపు సురేష్

వైఎస్ వివేకా హత్యకేసులో వైస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న అధికారులు.. పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేసిన జడ్జి ఎదుట హాజరుపరిచారు.

ఏప్రిల్ 26వ తేదీన పులివెందుల్లో తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌కు సంబంధించి మెమోను భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మికి అందజేశారు. భాస్కర్ రెడ్డిపై 130B, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఫై మంత్రి ఆదిమూలపు సురేష్ క్షణాల్లో మాట మార్చడం ఇప్పుడు వార్తల్లో నిలిచేలా చేసింది.

‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంపై ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన మంత్రి.. భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై మీ స్పందన ఏంటన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని గతంలో సీఎం జగనే చెప్పారని గుర్తు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, దోషులు ఎవరైనా బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు.

‘‘మేమే కదా.. మా ముఖ్యమంత్రిగారే కదా సీబీఐకి ఇవ్వాలని చెప్పింది. దోషులెవరైనా బయటికి రావాల్సిందే’’ అని అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా ఉన్న విషయాన్ని గ్రహంచిన మంత్రి ఆ తర్వాత తన క్యాంపు కార్యాలయానికి విలేకరులను ఆహ్వానించారు. భాస్కర్ రెడ్డి అరెస్టుపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చారు. ఇది బాధాకరమన్న ఆయన భాస్కర్‌రెడ్డి అమాయకుడని, ఆయనను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయన అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.