ఉద్యోగులకు శాశ్వతంగా ‘వర్క్ ఫ్రమ్ హోం’..మైక్రోసాఫ్ట్
హైదరాబాద్: కరోనా కారణంగా పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఇకపై శాశ్వతంగా అదే విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని వారి ముందుంచింది. అయితే, అన్ని రకాల ఉద్యోగులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు తమకు నచ్చితే.. పర్మనెంట్గా ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని కల్పించనున్నారు.
కరోనా సంక్షోభం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అమెరికాలోని తన ఆఫీసులను జనవరి వరకు ఓపెన్ చేసేదిలేదని కూడా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయాలనుకుంటే, వాళ్లు ఆఫీసులో తమ స్పేస్ను వదులుకోవాల్సి ఉంటుందని సంస్థ చెప్పింది. కోవిడ్19 అనేక సవాళ్లను విసిరిందని, కొత్త పద్ధతుల్లో జీవించడం, పని చేయడం నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్యాథ్లీన్ హోగన్ తెలిపారు. వ్యక్తిగత వర్క్ స్టయిల్కు మద్దతు ఇచ్చేందుకు వీలైనంత సహకరిస్తామని, అదే విధంగా వ్యాపారం కూడా కొనసాగేలా చూస్తామన్నారు. పర్మనెంట్ పద్ధతిలో ఇంటి నుంచి పని చేయాలనుకున్నవాళ్లు తమ మేనేజర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/