హైదరాబాద్ నగరవాసులకు షాక్ : పెరగనున్న మెట్రో ఛార్జీలు

Metro fares to rise

Community-verified icon


హైదరాబాద్ నగర వాసులకు బ్యాడ్ న్యూస్. అతి త్వరలో మెట్రో చార్జీలు పెరగనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో మెట్రో అందుబాటులోకి వచ్చాక ట్రాఫిక్ భారీగా తగ్గినా విషయం తెలిసిందే. ఆఫీస్ లకు దగ్గరగా మెట్రో స్టేషన్ లు ఉండడంతో ప్రతి రోజు వేలాది మంది ఉద్యోగులు మెట్రో లో ప్రయాణం చేస్తూ వస్తున్నారు. సాధారణ బస్సు చార్జీల తో పోలిస్తే మెట్రో చార్జీలు ఎక్కువే కానీ..ట్రాఫిక్ నుండి బయట పడేందుకు చార్జీల ను పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మెట్రో చార్జీలు మరింత పెరగబోతున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్‌ ప్రసాద్‌ ఛైర్మన్‌గా కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర కుమార్‌ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సభ్యులుగా కమిటీని నియమించింది. ప్రస్తుత ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపాలని కమిటీ ఛైర్మన్‌ ప్రయాణికులను కోరారు. మెయిల్‌ ([email protected]), ద్వారా గానీ, తపాలా ద్వారా అయితే ఛైర్మన్‌, ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ, మెట్రో రైలు భవన్‌, బేగంపేట, 500003 చిరునామాకు పంపాల్సిందిగా కోరారు. మరి ఎంత మేర చార్జీలు పెంచుతారో చూడాలి.

‘ఛార్జీలు ఎంత పెంచాలనేది ఇంకా నిర్ణయించలేదు. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేయనుంది’ అని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.