యూజర్లకు షాకిచ్చిన మెటా సంస్థ
ఇకపై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో బ్లూటిక్ ఖాతాదారుల నుంచి చార్జీలు వసూలు
న్యూఢిల్లీః సోషల్ మీడియా సంస్థల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ పేరిట ట్విట్టర్ యూజర్ల ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తోంది. తాజాగా మెటా సంస్థ కూడా ఇదే బాట పట్టింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్ల అకౌంట్ల ధ్రువీకరణ కోసం సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతున్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ఆదివారం ప్రకటించారు. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఈ సర్వీసును ప్రవేశపెడతామన్నారు.
మార్క్ ప్రకటన ప్రకారం.. ఈ సర్వీసు కోసం నెలనెలా వెబ్ యూజర్లు 11.99 డాలర్లు చెల్లించాలి. ఐఓఎస్ యూజర్ల నెలవారీ బిల్లు 14.99 డాలర్లు. ఈ సర్వీసుతో యూజర్లు తమ అకౌంట్లను ప్రభుత్వం కేటాయించిన గుర్తింపు కార్డులతో మెటా ధ్రువీకరణ(వెరిఫికేషన్) పొందచ్చు. వెరిఫికేషన్ పూర్తయిన అకౌంట్లకు ‘బ్లూ బ్యాడ్జ్’ కేటాయిస్తారు. అంతేకాకుండా.. సబ్స్క్రిప్షన్ ఉన్న అకౌంట్లకు నకిలీల బెడద లేకుండా ఫేస్బుక్ అదనపు భద్రత కల్పిస్తుంది. నేరుగా కస్టమర్ కేర్తో సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది.
తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఈ సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతున్నట్టు మార్క్ తెలిపారు. విడతల వారీగా అన్ని దేశాలకూ విస్తరిస్తామన్నారు.