భారత్ పర్యటన ఎంతో అద్భుతం
ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియాట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు భారత్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈసందర్భంగా అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ ఢిల్లీలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన హ్యాపీనెస్ క్లాసుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో ఉత్సాహంగా గడిపారు. ఢిల్లీలోని దక్షిణ మోతీబాగ్ లో ఉన్న సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్ ను సందర్శించిన మెలానియా అక్కడి బోధనా విధానాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న హ్యాపీనెస్ క్లాసులతో చిన్నారులే కాకుండా తాను కూడా స్ఫూర్తి పొందానని తెలిపారు. ఇలాంటి ఆనంద భరిత కార్యక్రమాలతో విద్యార్థులు తమ రోజును ప్రారంభించడం హర్షణీయం అని పేర్కొన్నారు. తాను భారత్ రావడం ఇదే తొలిసారి అని, తన పర్యటన ఎంత అద్భుతంగా ఉందో ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. ఈ పర్యటన సాగుతున్న తీరు పట్ల అధ్యక్షుడు ట్రంప్, తాను ఎంతో సంతోషంగా ఉన్నామని మెలానియా వివరించారు. తనను సంప్రదాయ విధానంలో స్వాగతించడాన్ని మరువలేనని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/