తెలంగాణ మేడారం మహా జాతరకు తేదీలు ఖరారు!

వచ్చే ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు జాతర

Medaram jatara
Medaram jatara

హైదరాబాద్ః తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా మేడారం మహా జాతరకు గుర్తింపు ఉంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరలో ఆదివాసీ గిరిజన దైవాలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకునేందుకు కోటికిపైగా భక్తులు మేడారం వస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర తేదీలను పూజారులు నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు సమావేశమై తేదీలను ప్రకటించారు. వచ్చే ఫిబ్రవరి 21-28 తేదీల మధ్య మహా జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీన మాఘశుద్ధ పంచమి సందర్భంగా మండమెలిగే పండుగతో అమ్మవార్ల జాతర ప్రారంభమవుతుంది.

కానీ, 21వ తేదీ మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గుడి మెలిగే పండుగతో పాటు సారలమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఆ రోజు నుంచే అసలైన జాతర మొదలవుతుంది. 22వ తేదీ మాఘశుద్ధ త్రయోదశి గురువారం కంకవనం గద్దె మీదకు వచ్చుట, సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటారు. 23వ తేదీ మాఘ శత్రుదశి శుక్రవారం సమ్మక్క-సారలమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజుకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 24వ తేదీ మాఘశుద్ధ పౌర్ణమి శనివారం రోజు దేవతలు వనప్రవేశం చేస్తారు. 28వ తేదీ మాఘశుద్ధ బహుల పంచమి బుధవారం రోజు తిరుగు వారం పండుగను నిర్వహిస్తారు. దాంతో, మేడారం జాతర మహాక్రతువు ముగుస్తుంది.