మక్కా మసీదులో ప్రార్థనలకు అనుమతి
మొదటి 15 రోజుల్లో 50 మందికి అనుమతి

హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో బుధవారం అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఈసమావేశంలో మక్కా మసీదులో శనివారం నుండి ప్రార్థనలకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతించారు. మొదటి 15 రోజుల్లో 50 మందికి మాత్రమే ప్రార్థనలకు అనుమతిస్తారు. అనంతరం 100 మందికి అనుమతి ఉంటుంది. కరోనా నేపథ్యంలో మక్కా మసీదు దాదాపు ఆరు నెలలుగా మూసివేయబడింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం స్పందిస్తూ… కోవిడ్19 మార్గదర్శకాలను అనుసరిస్తూ, భౌతికదూరాన్ని పాటిస్తూ మసీదులో ప్రార్థనలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మసీదు ప్రాంగణాన్ని శానిటైజ్ చేస్తున్నామన్నారు. రాబోయే రెండు రోజుల్లో ప్రార్థనల కోసం స్థలాలను మార్క్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో మొహద్ ఖాసిం, ఎఐఎంఐఎం ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/