14 ఏళ్ల తర్వాత పెరుగుతున్న అగ్గిపెట్టె ధర..

14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్టె ధర పెరుగుతుంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో.. ప్రతి ఇంట్లోనూ అత్యవసరమైన అగ్గిపెట్టె మాత్రం 14 ఏళ్లుగా ఒక్క రూపాయికే దొరుకుతోంది. కానీ, ఇప్పుడు దీని ధర కూడా పెరుగుతుంది. నవంబర్ 1 నుంచి అగ్గిపెట్టె ధరను రెండు రూపాయలు చేయాలని తయారీదారులు నిర్ణయించారు.

అగ్గిపుల్ల తయారీలో వినియోగించే రెడ్‌ఫాస్ఫరస్, మైనం, బాక్స్ బోర్డులు, పేపర్, పొటాషియం క్లోరేట్, గంధకం వంటి వాటి ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధర పెంచక తప్పడం లేదని తయారీదారులు పేర్కొన్నారు. అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 సంఘాలు శివకాశీలో సమావేశమై ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. కాగా, చివరిసారి 2007లో అగ్గిపెట్టె ధరను పెంచారు. అప్పట్లో రూ. 50 పైసలు ఉన్న అగ్గిపెట్టె ధరను రూపాయికి పెంచారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ధరను రెట్టింపు చేశారు. ప్రస్తుతం 600 అగ్గిపెట్టెలు ఉన్న బాక్స్‌ను రూ. 270-300 మధ్య విక్రయిస్తుండగా, తాజా నిర్ణయంతో దీని ధర రూ. 430-480కి పెరగనుంది.