సత్యసాయి జిల్లాలో ప్రమాదం : ఆటోపై తెగిపడిన హై టెన్షన్ విద్యుత్ తీగలు.. ఐదుగురు సజీవ దహనం

సత్యసాయి జిల్లా లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కదులుతున్న ఆటోపై హై టెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. తాడిమర్రి మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..

చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఆటోలో వెళ్తుండగా..వీరు ప్రయాణిస్తున్న ఆటో ఫై ఒక్కసారిగా హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగి ఆటోమీద పడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఆటో మొత్తాన్నీ చుట్టు ముట్టాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. లోపల ఉన్న కూలీలకూ మంటలు అంటుకున్నాయి. ఆటో లో ఉన్నంత వారు హాహాకారాలు.. ఆర్తనాదాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు అందరూ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్‌ తో కలిపి 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ఐదుగురు సజీవ దహనం అయ్యారు.

ఆటోకు మంటలు అంటుకోవడంతో డ్రైవర్ వెంటనే పక్కకు నిలిపేశాడు. కానీ.. ఆటో మొత్తం రెగ్జిన్ కవర్ తో కప్పబడి ఉండడంతో.. క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. దీంతో.. కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తమ స్నేహితులు, తోటి వారిని రక్షించుకునేందుకు మిగిలిన కూలీలు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. మృతులంతా మహిళలే కావడం , ఒకే కుటుంబానికి చెందిన వారు అంటున్నారు. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో.. గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి.. పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయ పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విదేశాల నుంచి అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.. అన్నీ చర్యలు తీసుకోవాలన్నారు.