మసూద్‌ అజర్‌ కుటుంబంతో సహా కనిపించట్లేదు

తెరపైకి పాకిస్తాన్‌ కొత్త నాటకం

Masood Azhar
Masood Azhar

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరో సరికొత్త నాటకానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ అటు ప్రపంచ దేశాల నుంచి వస్తోన్న ఒత్తిళ్లు.. ఇటు స్వదేశంలో చురుకుగా కొనసాగుతున్న తీవ్రవాదులను కట్టడి చేయలేక సతమతమౌతోన్న పాకిస్తాన్ ప్రభుత్వం బుకాయింపు ధోరణిని అనుసరిస్తున్నట్టుంది. ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ న్యాయస్థానం అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన కొద్దిరోజుల్లోనే మరో సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర పడిన జైషె మహ్మద్ చీఫ్ అధినేత మౌలానా మసూద్ అజర్, అతని కుటుంబం కొద్దిరోజులుగా కనిపించట్లేదని తాజాగా ప్రకటించింది పాకిస్తాన్. దేశ భద్రత బలగాల రాడార్ నుంచి తప్పించుకున్నాడని, ఎక్కడికెళ్లాడో తెలియట్లేదనే విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (పీఏటీఎఫ్)కు అధికారికంగా లేఖ రాసింది. తాము మసూద్ అజర్, అతని కుటుంబ సభ్యుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు వెల్లడించింది.

కొద్దిరోజుల నుంచి మసూద్ అజర్ గానీ, అతని కుటుంబ సభ్యులు గానీ కనిపించట్లేదని స్పష్టం చేసింది. మసూద్ అజర్‌ను గాలించడానికి ప్రత్యేక బలగాలను నియమించినట్లు పేర్కొంది. జైషె మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా భావిస్తోన్న ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్ సహా పాకిస్తాన్‌లోని ఉత్తర ప్రాంతంలో అతని కోసం గాలిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తెలియజేసింది. సైనిక జవాన్ల సహాయాన్ని కూడా తీసుకుంటున్నట్లు పేర్కొంది. పాకిస్తాన్ చేసిన ఈ ప్రకటన పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ప్రపంచ దేశాల కళ్లుగప్పడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అతణ్ని దాచి పెట్టిందని, కనిపించట్లేదంటూ బుకాయిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు ఉన్న మసూద్ అజర్ సహా అతని కుటుంబ సభ్యులు కనిపించకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంటుందనే విమర్శలు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/