దాంపత్య జీవితం విచ్ఛినం కాకూడదు
వైవాహిక జీవనం
ఈ మధ్యకాలంలో పెళ్లి పెటాకులు అనే మాట తరచుగా వింటూనే ఉన్నాం. మన హిందూ సంప్రదాయంలో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
అలాంటిది నేటి యువత పొద్దున పెళ్లి చేసుకుంటే సాయంత్రానికి విడాకులకు సిద్ధమవుతున్నారు.
ఎందుకు ఇలా జరుగుతోంది. ఆడపిల్లలకు చదువులు ఎక్కువ అవటమా, తల్లిదండ్రులు జోక్యం చేసుకోవటమా.
పెళ్లి అంటే సర్దుబాటు అనేది తెలియకపోవటమా, అహంభావాలకు ఏమిటి కారణాలు. వైవాహిక జీవితం మన సమాజంలో ఎంతో గౌరవాన్ని ఇస్తుంది.
అటువంటి వైవాహిక జీవితాన్ని పురుషులు తమ పురుషాధిక్యతతో స్త్రీలను బాధిస్తుంటే, స్త్రీలు పురుషుల కంటే మేము దేనిలో తక్కువ, వారి దుశ్చర్యలను మేము ఎందుకు భరించాలి అని అంటారు.
చిన్న విషయాలను పెద్దవి చేసుకుని వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవటం కంటే, ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు తగ్గి ఉంటే సమస్య ఎక్కువ కాదు అనే విషయాన్ని గ్రహించాలి.
పూర్వకాలంలో పెళ్లంటే నూరేళ్లపంట. అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు. నిజమే ఇలాంటి వైవాహిక జీవితం జీవితకాలంలో సుమారు 40 నుండి 50 సంవత్సరాల వరకు లభించవచ్చు. ఇంతలోనే ఎన్నో మనస్పర్థలు, వివాదాలు తెగతెంపులు జరగవచ్చు.
లేదా సాఫీగా ఆనందంగా వారి జీవితం సాగిపోవచ్చు. ఇలా జరగటానకిఇ కారణం ఏమిటని ఆలోచిస్తే సర్దుబాటు ఒక్కటే మార్గమని అంటారు పెద్దలు. మరి ఈ సర్దుబాటు చేసుకునే దపంతులు ఎందరుంటారంటే ఆలోచించాల్సిన ప్రశ్నే మరి.
ఎన్నో విధాలుగా ఏర్పడే దాంపత్య జీవితంలో వివాదాలకు ఎవరు మూలం? అని ప్రశ్నించుకుంటే దానికి ఎన్నో సమాధానాలు, వాటిలో కాలం ప్రముఖ పాత్ర వహిస్తుంది.
దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతే ఆ భార్యాభర్తలే కాకుండా వారి తరాలు కూడా ఆ ఆనందాన్ని పంచుకొంటాయన్న నమ్మకం కూడా సడలిపోతోంది.
దానికి కారణం మారిపోయే కాల పరిస్థితులు, కాంట్రాక్ట్ మ్యారేజ్ పద్ధతులను, ఆహ్వానించే రోజులు వచ్చేశాయి. అలాంటప్పుడు పెళ్లికి దాంపత్య జీవితానికి విలువ ఎక్కడుంది?
పండంటి కాపురానికి ఎన్ని సూత్రాలు చెప్పినా ఏం లాభం ఉంటుంది? స్త్రీ పురుషుల ఆలోచనా సరళిలో అనేక మార్పులు వచ్చాయి.
కాలానుగుణంగా స్త్రీ పురుషులు సమానం అనే అర్ధం వరకు అనేక మార్పులు జరుగుతున్నాయి. ఒకనాటి పురుషాధిక్య ప్రపంచం దీనిని కొంతవరకు స్వాగతిస్తున్నా కొంత అసంతృప్తిని చూపుతూనే ఉంది.
అదేవిధంగా స్రీలు పురుషుడి కంటే అధికమనే భావన కూడా కూడా వారి పతనానికి నాంది పలుకుతోంది.
‘ఆడది తిరిగి చెడింది మగాడు తిరక్క చెడినాడు’ అనే సామెతను తీసుకుంటే నేడు ఉద్యోగాలు వ్యాపారరంగంలో ఉండే స్త్రీలు నిత్యం ఏదో ఒత్తిడులతో పదిమందితో మాట్లాడి కనిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనిని జీర్ణించుకోలేని భర్తలు వారి పట్ల అసభ్యతను ప్రదర్శిస్తున్నారు. ఇక మగవారి విషయానికి వస్తే కొందరు స్త్రీలు కూడా ఇలా ప్రవర్తించడం జరుగుతోంది.
అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడది పుట్టిందని నిరూపించుకుంటున్నారు. మరలాంటప్పుడు స్త్రీ పురుషుల మధ్య సర్దుబాటు ఎలా సాధ్యమవుతుంది.
మనిషికి మనిషి పై నమ్మకం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
అనుమానపు చేష్టలు చేస్తున్నామని ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటే అవే కొంతకాలానికి నిజమైన పరిస్థితి కూడా దాపురించవచ్చు.
ఎందరు వేలుపెట్టి చూపడానికి ప్రయత్నిస్తున్నా రెండు ప్రేమించుకునే హృదయాల మధ్య అనుమానమనే పెనుభూతం అంత త్వరగా చొరబడడానికి ప్రయత్నించదు.
దాంపత్య జీవితంలో కలహం అనే బీజం మొదలయితే మూడో వ్యక్తి అనే మొక్క అవతరిస్తుంది. ఆ వ్యక్తి ఆ జీవితాలను బాగుచేసి నిలిపే వాడైనా కావచ్చు. లేదా నిలువునా కూల్చేవాడైనా కావచ్చు.
మూడో వ్యక్తి జోక్యంతో కాపురాలను చక్కదిద్దుకోవాలి అనుకోవడం కంటే అవివేకం మరొకటి దు. వీలైనంతవరకు భార్యాభర్తలే చక్కదిద్దుకోగిలితే ఆ నమ్మకం, గట్టితనం వేరు.
మూడో వ్యక్తి కుటుంబసభ్యుడు అయితే జీవితానికి కలిగే హాని తక్కువగా ఉంటుంది. మూడో వ్యక్తికి కష్టం బాధ చెప్పుకుంటే కొంతైనా ఉపశమనం జరుగుతుందని చాలా మంది భావిస్తారు.
ఇందులో చాలా వరకు నిజం లేకపోలేదు.
కానీ మూడో వ్యక్తిలో స్వార్ధం పెరిగితే మాత్రం అంత ప్రమాకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. అందుకే సాధ్యమైనంతవరకు మూడో వ్యక్తి అవసరం లేకుండానే దాంపత్య జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించటం మంచిది.
కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా చాలా వరకు మార్పు తీసుకురావచ్చు అనేది పెద్దల అభిప్రాయం.
ఇది చాలా వరకు అందరి సమక్షంలో జరిగే ప్రక్రియ కనుక భార్యభర్తలు తమ అభిప్రాయాల విషయాల్లో అనేక మార్పులు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
డిటెక్టివ్ ఏజెన్సీల ద్వారా దాంపత్య జీవితంపై అన్వేషణ అనేది చాలా ప్రమాదకరమైనది అనే చెప్పాలి.
ఎందుకంటే ఎవరైతే ఈ ఏజెన్సీలను సంప్రదిస్తారో వారికి అనుకూలంగానే ఇవి ఎక్కువగా పనిచేసి దాంపత్యజీవితంలో ఇంకా ఎక్కువగా అగాధాన్ని సృష్టించడానికి అవకాశం ఏర్పడుతుంది.
డిటెక్టివ్ ఏజెన్సీల ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకోవడం అవివేకమే అవుతుంది.
తెలియని రెండు మనసుల ముడి కోసం, ఎరుగని రెండు కుటుంబాలు కలిసి చేసుకునే ఒప్పందం పెళ్లి.
కష్టసుఖాల కావడిని మోసే దాంపత్య జీవితంలో స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుని సమాన మని భావించకున్నప్పుడు ఆ బంధం నూరేళ్లు సాగిపోతుంది.
ఆదర్శంగా నిలిచిపోతుంది. ఎవరిదైనా దానికి మనసారా ఆస్వాదించగలిగే ఆ దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.
ప్రతి ఒక్కరు వివాహం ప్రాముఖ్యతను తెలుసుకుని, ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ, పరిస్థితులకు సర్దుకుపోతూ, అన్నింటికంటే ముఖ్యమైనది నమ్మకం.
దానిని నిలబెట్టుకుంటూ, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమతా నీది నాది అనేలా ఉండాలని, జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ..
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/