మారటోరియాన్ని పొడిగించే యోచనలో ఆర్బీఐ!

వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ వర్గాలు

RBI

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆర్బీఐ తొలుత మూడు నెలల పాటు అన్ని రకాల రుణాల చెల్లింపులపై మారటోరియాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆపై దాన్ని మరో మూడు నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికీ చాలా రంగాలు లాక్ డౌన్ ప్రభావం నుంచి బయటపడక పోవడంతో ఆగస్టు 31తో ముగియనున్న మారటోరియాన్ని మరికొంతకాలం పొడిగించాలన్న ఆలోచనలో ఆర్బీఐ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని, అయితే, అన్ని రంగాలకూ కాకుండా, ఇప్పటికీ తీవ్ర ఒత్తిడిలో ఉన్న విమానయాన రంగం, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, టూరిజం తదితర రంగాలకు మినహాయింపులు ఇచ్చే యోచన చేస్తున్నట్టు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.

ఈ రంగాల్లో రుణాలు ఏ మేరకు ఉన్నాయి? తనఖా ఆస్తుల విలువెంత? తదితర అంశాలను మదిస్తున్న రిజర్వ్ బ్యాంక్, లాక్ డౌన్ సమయం నుంచి క్యాష్ ఫ్లో, రీ పేమెంట్స్ తదితర విషయాలనూ సమీక్షిస్తోంది. ఈ మేరకు వివిధ బ్యాంకులతో సైతం ఆర్బీఐ అధికారులు చర్చలు జరిపారని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఇద్దరు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఇక స్టార్టప్ సంస్థలకు కూడా మరికొంతకాలం మద్దతుగా నిలవాలని ఆర్బీఐ యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం మరింత కాలం కొనసాగుతుందన్న ఆంచనాల నేపథ్యంలోనే, మారటోరియాన్ని పొడిగించే యోచన చేస్తున్నట్టు సమాచారం.

ఇదిలావుండగా, వ్యక్తిగత రుణ గ్రహీతలకు మాత్రం మరోమారు మారటోరియం పొడిగింపు అవకాశాలు లేవని తెలుస్తోంది. చాలా రంగాలు తిరిగి తెరచుకోగా, వ్యక్తిగత రుణాలపై మారటోరియం పొడిగించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావిస్తోంది. బ్యాంకుల నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం, ఏప్రిల్ జూన్ మధ్య కాలంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలను తీసుకున్న వారిలో 29 శాతం, ఆర్థిక సేవల సంస్థలు ఇచ్చిన రుణాలు తీసుకున్న వారిలో 59 శాతం మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నారు. సరాసరిన 30.6 శాతం మంది రుణ గ్రహీతలు ఈఎంఐలను చెల్లించలేదు. ఈ మొత్తం విలువ సుమారు రూ. 2.83 లక్షల కోట్ల వరకూ ఉంటుందని అంచనా.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/