ఏపీ మంత్రికి మావోయిస్టుల హెచ్చరిక

ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది వైస్సార్సీపీ లేదా టీడీపీ కావొచ్చు ఏదైనా మావోయిస్టు పార్టీ ముందు ఒక్కటే అని ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదల చేశారు.

లేఖలో ఏముందనేది చూస్తే..‘ప్రజలారా, విప్లవాభిమానులారా, అభిమానులారా మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన అనుయాయులు చేస్తున్న భూదందాని బయటపెట్టి వారు అక్రమంగా ఆక్రమించిన రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుంచి తక్షణమే వైదొలగాలనీ, ఆ భూములు ఈ ప్రాంత పేద ప్రజలకే చెందాలనీ కోరారు. ప్రజల తరపున మాట్లాడిన మావోయిస్టు పార్టీ పైన, ఆపార్టీ ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీపైన మంత్రి అప్పలరాజు సోషల్ మీడియాలో విరుచుకుపడడం, పార్టీ పంపిన లెటర్ను ప్రచారం చేసిన వారిపై చర్యలు ఉంటాయని భయపెట్టడం అతని దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ట’అన్నారు.

‘తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో దాడి విషయం, ఇదే జిల్లాలో ఎంపీ కింజరాపు ఎర్రంనాయుడుపైన దాడి విషయం, హెూం మంత్రి మాధవ రెడ్డిని అంతమొందించిన విషయం తెలిసే మాట్లాడుతున్నారో లేక తెలియక మాట్లాడుతున్నారో అన్నారు. దోపిడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది వైసీపీ లేదా తెలుగుదేశం కావొచ్చు ఏదైనా మావోయిస్టు పార్టీ ముందు ఒక్కటే అని గుర్తుంచుకోవాలన్నారు. ఇంకా ఆ లేఖలో ఏముందంటే.. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటాయో అక్కడ మావోయిస్టు పార్టీ పేదప్రజల తరఫున నిలబడి మాట్లాడుతుందన్నది జగమెరిగిన సత్యం. మావోయిస్టు పార్టీ సభ్యులు ప్రజల కోసమే జీవిస్తారు. ప్రజల కోసమే మరణిస్తారు. ఇదే నడుస్తున్న చరిత్ర’అని లేఖలో ప్రస్తావించారు.

‘మహాత్తర త్యాగాల బాటలో పయనిస్తున్న మావోయిస్టు పార్టీపై మంత్రి, వారి అనుచరులు ఇక్కడ మావోయిస్టు పార్టీ ప్రజా సంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న దుష్ట చతుష్టయం (పోతనపల్లి అరుణ, కోదండం, పత్తిరి దానేసు, కొర్రయి నీలకంఠం) లోపాయికారిగా ఇస్తున్నసూచనలు, సలహాలు, సహకారంతో చాలా దురహంకారపూరితంగా నోటికి వచ్చినట్లు వాగడం, అధికార మదంతో విర్రవీగడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వీరి అకృత్యాలకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని మరచిపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే దుష్ట చతుష్టయం వీరి వీరి పద్ధతులు మార్చుకోవాలని, లేని యెడల ప్రజల కోపానికి గురికాక తప్పరని తెలియజేస్తున్నాం’అంటూ హెచ్చరించారు.

‘వీరి దోపిడీ దౌర్జన్యాలకు ముగింపు పలికి ప్రజలకు క్షమాపణ చెప్తే చరిత్ర క్షమిస్తుంది. లేకపోతే చరిత్రలో ప్రజా శత్రువులకు పట్టిన గతే వీరికీ పట్టక మానదు. అప్పుడు వీరిని ఆదుకోడానికి ఎవ్వరూ ఉండరు. ఇదే చారిత్రక సత్యం. అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదని గుర్తించడం మంచిది. అలాగే ప్రజలకోసం పనిచేస్తున్న మావోయిస్టు పార్టీపై వీరు పన్నుతున్న కుతంత్రాలను, చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించవలసినదిగా ప్రజలను కోరుతున్నామంటూ’ విప్లవ యువజన సంఘం ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ అశోక్, కార్యదర్శి పేరిట రెండు పేజీలు లేఖ చక్కర్లు కొడుతుంది. ఈ లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు.