ములుగులో మాజీ సర్పంచ్‌‌ని కిడ్నాప్ చేసిన మావోలు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం చర్లకి వెళ్తుండగా ఆయన్ను కిడ్నాప్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన వృత్తిరీత్యా డ్రైవర్. ఆయన భార్య రజిత ఏటూరునాగారం ఆస్పత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. దీంతో కుటుంబంతో కలసి ఏటూరు నాగారంలో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌గా పనిచేసే రమేష్‌కి మావోయిస్టులతో పరిచయం ఉన్నట్లు చెబుతున్నారు. కిడ్నాప్ చేశారని తెలిసినప్పటి నుంచి భార్య రజిత, కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

తనకు ఇద్దరు చిన్న పిల్లలున్నారని.. ఆయనకి ఏమైనా జరిగితే తమ పరిస్థితేంటని భార్య రజిత వాపోతోంది. రమేశ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి పెట్టాలని ఆయన భార్య మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తోంది.