సికింద్రాబాద్ కాల్పుల ఫై మావోయిస్టుల లేఖ
‘‘అగ్నిపథ్’’ను వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్ రైల్లేస్టేషన్లో ఆందోళనకారులు బీబత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ స్కీంకు వ్యతిరేకంగా శుక్రవారం ఆర్మీ విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అగ్ని గుండంగా మార్చారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా వరంగల్ జిల్లా కు చెందిన రాకేష్ మృతి చెందాడు. తాజాగా ఈ ఘటన ఫై మావోయిస్టుల లేఖ రాసారు.
కాల్పుల ఘటనను ఖండిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరిట మావోయిస్టులు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించిన మావోయిస్టులు… ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని కూడా ఆ లేఖలో డిమాండ్ చేశారు మావోయిస్టులు. సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, బాధితుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు మావోయిస్టులు. అంతేకాకుండా కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మరోపక్క ఈ అల్లర్ల ఫై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 56 మందిని రిమాండ్ కు తరలించి వారి నుండి కీలక విషయాలు రాబడుతున్నారు. కామారెడ్డికి చెందిన మధుసూదన్ ను ప్రధాన సూత్రధారి (ఏ-1)గా పోలీసులు తేల్చారు. ఈ మేరకు వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులను మధుసూదన్ రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్దారించారు.