తీహార్ జైలుకు సిసోడియా..జ్యుడీషియల్ కస్టడీ 20 వరకు పొడిగింపు
న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ఇవాళ్టి సిసోడియాకు విధించిన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆయనను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. అదేవిధంగా కేసుకు సంబంధించి సిసోడియా నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దాంతో కోర్టు మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు గత నెల 26న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయనను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ముందుగా ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మార్చి 3న ఆ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన సీబీఐ అధికారులు మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని కోరారు. దాంతో మరో మూడు రోజులు జ్యుడీషియల్ రిమాండ్ను పొడిగించారు. ఇవాళ్టితో ఆ కస్టడీ గడువు కూడా ముగియడంతో కోర్టు మార్చి 20 వరకు సిసోడియా రిమాండ్ను పొడిగించింది.