అనాథ పిల్లలతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మంచు మనోజ్

మాములుగా సినీ స్టార్స్ బర్త్ డే వేడుకలు ఎలా ఉంటాయో తెలియంది కాదు..కోట్ల రూపాయిలు ఖర్చు చేసి వేడుకలు జరుపుకుంటారు. కానీ మంచు మనోజ్ మాత్రం నిన్న (మే 20) తన పుట్టిన రోజు వేడుకలను అనాథ పిల్లలతో జరుపుకొని వార్తల్లో నిలిచారు. బర్త్ డే సందర్భంగా గాజుల రామారంలోని ‘కేర్ అండ్ లవ్’ ఆశ్రమానికి వెళ్లిన మనోజ్.. అక్కడి పిల్లలతో కలిసి సందడి చేశారు. పిల్లల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి ఆడిపాడుతూ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా వారికి నోట్ పుస్తకాలు, బొమ్మలు, బ్యాగ్ లు, స్వీట్లు పంచిపెట్టారు. చిన్నారుల మధ్య పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మనోజ్ చెప్పుకొచ్చారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో పిల్లలకు మరింత సేవ చేస్తానని మనోజ్ తెలిపారు. అనాథ పిల్లలతో కలిసి పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకున్న మంచు మనోజ్ పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.