కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ నిప్పులు
కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.రాజకీయ ప్రత్యర్ధులపై కక్ష సాధింపు రాజకీయాలతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించి దాడులు చేయిస్తోందని మమతా ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టుకుపోతుందని, ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జోస్యం చెప్పారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
2024లో బిజెపి ఓడిపోతుంది. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా ఆధిక్యం బిజెపి కి రాదు. అదే జరిగితే.. ఇతర పార్టీలన్నీ కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. బిజెపి బందిఖానాను, సంకెళ్లను బద్దలుకొట్టండి. 2024లో మనం ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలి.” అని మమత అన్నారు.
1993లో మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో యూత్ కాంగ్రెస్ ర్యాలీ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించారు. దీంతో జులై 21న అమరవీరుల దినంగా టీఎంసీ పాటిస్తోంది. ఏటా ఇదే రోజున భారీ ర్యాలీని నిర్వహిస్తూ టీఎంసీ అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునే ఆనవాయితీని పాటిస్తోంది.