బిజెపి ఆరోపణలను నిజం చేస్తున్న మంత్రి మల్లారెడ్డి..

టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి కొంత మందికి మద్యం పోస్తూ ఉన్న పిక్ ఇప్పుడు మీడియా లో వైరల్ గా మారింది. ఈ పిక్ ను షేర్ చేస్తూ ప్రతిపక్షపార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ గా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక కు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. దీంతో అన్ని పార్టీల నేతలు మునుగోడు లో ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తాగినోడికి తాగినంత, తిన్నోడికి తిన్నంత అన్న చందంగా విందు, మందు రాజకీయం కనిపిస్తుంది.

ఇదిలా ఉంటె మునుగోడు ఉప ఎన్నికకు చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామం ఇన్చార్జిగా మంత్రి మల్లారెడ్డి నియమితులయ్యారు. అయితే అందరిలా కాకుండా మల్లారెడ్డి, ఓటర్లను ఆకట్టుకోవడానికి తనదైన శైలిలో పని మొదలుపెట్టారు. ఇప్పటికే మందు, విందులతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు వస్తున్న వేళ చౌటుప్పల్ సమీపంలోని ఒక హోటల్ ను బుక్ చేసుకున్న మల్లారెడ్డి.. మందు బాటిల్ పట్టుకొని కొంతమందికి మందు పోస్తున్నట్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి మల్లారెడ్డి ఫుల్ లిక్కర్ బాటిల్ పట్టుకొని తనతో కలిసి కూర్చున్న వారందరికీ మందు పోస్తున్నట్లు కనిపిస్తుండడంతో ప్రతిపక్షపార్టీలు ఈ ఫోటో ను షేర్ చేస్తూ టిఆర్ఎస్ ఫై ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనిపై టిఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి ఫై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.