త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా బిజెపిలో చేరతారని మల్లారెడ్డి కామెంట్స్

త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా బిజెపిలో చేరతారని టిఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే కలిసిపోయాయని ఆరోపించిన మల్లారెడ్డి, ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు గల్లంతూ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. బిజెపికి కార్యకర్తలు లేక బహిరంగ సభలకు కిరాయి మనుషులను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

షామీర్ పేట మండల కేంద్రంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ బీజేపీలోకి పంపి ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా బిజెపిలో చేరతానంటూ వ్యాఖ్యలు చేశారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఒక్కటైన మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, కాంగ్రెస్ ఇప్పటికే దివాలా తీసింది అని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక పైనే అన్ని పార్టీలు ఫోకస్ చేసాయి. ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి తీరాలని కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే సభలు , సమావేశాలతో ప్రచారం మొదలుపెట్టాయి.