సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..నూతన డైరెక్టర్ కన్నుమూత

చిత్రసీమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ కాకపోతే ఒక ఇండస్ట్రీ..ఇలా రోజు ఎవరో ఒకరు మరణిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న కళాతపస్వి కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూయగా..ఈరోజు మరో మరణ వార్త వెలుగులోకి వచ్చింది. మలయాళ నూతన దర్శకుడు జోసెఫ్‌ మను జేమ్స్‌ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్‌.. కేరళ (అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్‌ కు చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.

‘ఐయామ్‌ క్యూరియస్’ మూవీ తో బాలనటుడిగా జోసెఫ్‌ మను జేమ్స్‌ పరిచయం అయ్యారు. ఈ మూవీ 2004లో రిలీజైంది. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్‌ సినీపరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో పలు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ‘నాన్సీ రాణి’ సినిమాతో పూర్తిస్థాయిలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తను తెరకెక్కించిన సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో అహానా క్రిష్ణ , అర్జున్‌ అశోకన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, తన తొలి సినిమా చూడకముందే జోసెఫ్‌ మరణించడంతో చిత్రయూనిట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.