పార్లమెంట్లో ప్రత్యేక భోజనానికి ముందు బిజెపి ఎంపీలకు ప్రధాని సూచన
యోగా అంతటి ప్రాచుర్యం మిల్లెట్స్ కు రావాలి..ప్రధాని
న్యూఢిల్లీ : అధిక పోషకాలు కలిగిన మిల్లెట్స్ (సిరి ధాన్యాలు) వినియోగం అన్నది యోగా అంతటి ప్రాచుర్యానికి నోచుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందినట్టు.. ఓ వ్యవస్థీకృత ప్రచారాన్ని మిల్లెట్స్ కు కల్పించాలని బిజెపి ఎంపీలను కోరారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం కావడంతో, ఎంపీలు అందరికీ మంగళవారం ప్రత్యేకంగా మిల్లెట్స్ లంచ్ ను కేంద్ర వ్యవసాయ మంత్రి ఏర్పాటు చేయగా, దీనికి ముందు ప్రధాని ఈ సూచన చేయడం గమనార్హం.
ఖేల్ సంసద్ యోజన కార్యక్రమంలో బిజెపి ఎంపీలు అందరూ చురుగ్గా పాల్గొనాలని ప్రధాని మోడీ కోరారు. గ్రామాల్లో కబడ్డీని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా స్థాయిలో కబడ్డీ లీగ్ లు చేపట్టాలని కోరారు. 2024 లోక్ సభ ఎన్నికల ముందు క్రీడా పోటీల ద్వారా యువతను చేరుకోవాలని ఆయన సూచన చేశారు. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని.. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడం తెలిసిందే. ఎంపీలకు మిల్లెట్స్ లంచ్ లో భాగంగా రాగి, జోవార్ (జొన్న), బజ్రా తదితర మిల్లెట్స్ పదార్థాలను వడ్డించనున్నారు.