ఉద్ధవ్‌ థాకరేను హెచ్చరించిన ఎస్‌పి నేత

Uddhav Thackeray
Uddhav Thackeray

మహారాష్ట్ర: సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ హెచ్చరికలు జారీ చేశారు. కేరళ, పశ్చిమబెంగాల్ మాదిరి వీటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టాలు ముస్లింలను సమస్యల్లోకి నెడుతాయని చెప్పారు. సెన్సస్ మాదిరి ఎన్‌పిఆర్‌ ను కూడా మహారాష్ట్రలో చేపట్టాలనుకుంటే… దాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అందుకే ముందుగానే ముఖ్యమంత్రికి తాము విన్నవిస్తున్నామని… తమ మాటను వినకపోతే రాబోయే రోజుల్లో వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని, దానికి తాము ఎంత మాత్రం సంకోచించబోమని హెచ్చరించారు. మరోవైపు శివసేన తీరును కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుబడుతోంది. కాంగ్రెస్ నేత మనీశ్ తివారి మాట్లాడుతూ… సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల మధ్య ఉన్న లింకును థాకరే అర్థం చేసుకోవాలని కోరారు. ఒక్కసారి ఎన్పీఆర్ పూర్తయితే… ఎన్నార్సీని అడ్డుకోవడం సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు.

ప్రధాని మోడి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్రలో సిఏఏ, ఎన్‌పిఆర్‌ లను అమలు చేయాలని వారిని థాకరే కోరారు. ఈ నేపథ్యంలోనే, సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రులు కూడా థాకరే పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/