శాలిమార్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ లో చెలరేగిన మంటలు

ప్రయాణికులకు తప్పిన ముప్పు

Maharashtra: Shalimar LTT Express catches fire near Nashik

నాసిక్‌ః శాలిమార్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్‌ వెనుక ఉండే లగేజ్‌ కంపార్టుమెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోకోపైలట్‌ గమనించి రైలును నిలిపేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. లోకోపైలట్‌ ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న సెంట్రల్‌ రైల్వే అధికారులు ఇంజిన్‌ను, రైలులోని ప్రయాణికుల బోగీలను ప్రమాదానికి గురైన లగేజ్‌ కంపార్టుమెంట్ నుంచి వేరు చేయించారు.

అనంతరం లగేజ్‌ కంపార్టుమెంట్‌ను పక్కన వదిలేసి ప్రయాణికుల బోగీలతో రైలును అక్కడి నుంచి పంపించేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌ ఏరియాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, లగేజ్‌ కంపార్టుమెంటులో చెలరేగిన మంటలతో ప్రయాణికుల బోగీలకు ఎలాంటి అపాయం వాటిల్లలేదని అధికారులు చెప్పారు.

అయితే, ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందన్న వివరాలు తెలియరాలేదని ముంబైలోని సెంట్రల్‌ రైల్వేకు చెందిన చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/