దేశాన్ని బాగు చేసే శక్తి రైతులకే ఉందిః సిఎం కెసిఆర్
కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర రైతు సంఘం నేత
హైదరాబాద్ః నేడు సిఎం కెసిఆర్ సమక్షంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ తో పాటు పలువురు రైతు నేతలు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మహారాష్ట్ర రైతు సంఘం నాయకుడు శరద్ జోషి ప్రణీత్, ఇతర రైతులు సిఎం కెసిఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. మహారాష్ట్ర రైతులకు కెసిఆర్ సాదరంగా పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రసంగించారు.
ఒకప్పుడు తెలంగాణ రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదని తెలిపారు. ప్రతి రోజూ ఐదారుగురు రైతులు చనిపోయిన పరిస్థితులు చూశామని వెల్లడించారు. వాళ్ల పరిస్థితి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ తీరిపోయాయని కెసిఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. హిమాలయాల్లో కంటే ఉన్నతమైన సంకల్పం ఇక్కడ ఉందని, అందుకే ఎండాకాలంలోనూ ఇక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయని అన్నారు.
దేశంలో దేనికీ కొదవలేదని, కానీ ఎలాంటి వనరులు లేకపోయినా సింగపూర్ అలా ఎందుకుంది? మనం ఇలా ఎందుకున్నాం? అని కేసీఆర్ ప్రశ్నించారు. సింగపూర్ లో కనీసం మట్టి కూడా లేదన్నారు. ధర్నా చేస్తున్న రైతులను కేంద్రం ఉగ్రవాదులతో పోల్చిందని, రైతులు తమ సమస్యలపై చెక్కుచెదరకుండా పోరాటం చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. చివరికి ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పారని తెలిపారు.
వాహనాల వేగం ప్రపంచంలో ఎలా ఉంది? భారత్ లో ఎలా ఉంది? అని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే అంతర్జాతీయంగా మనం ముందుకు ఎలా వెళతామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని బాగు చేసే శక్తి రైతులకు మాత్రమే ఉందని ఉద్ఘాటించారు.