అమరావతి రైతుల పాదయాత్రకు మహారాష్ట్ర రైతుల సంఘీభావం

పుణె, పింప్రి, చించ్వాడ్, బోసారి నుంచి వచ్చిన రైతులు

శ్రీకాళహస్తి : అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ తో ఏపీ రైతులు, మహిళలు చేపట్టిన పాదయాత్ర 41వ రోజుకు చేరుకుంది. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట చేస్తున్న యాత్ర ఇవాళ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు సాగనుంది. దాదాపు 17 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్రగా వెళ్తారు. స్థానిక మహిళలకు పసుపు, కుంకుమ, తాంబూలాలను మహిళా రైతులు ఇచ్చారు.

అమరావతి రైతుల యాత్రకు మహారాష్ట్ర రైతులు మద్దతు తెలిపారు. పుణె, పింప్రి, చించ్వాడ్, బోసారి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రైతులకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని పాదయాత్రకు తరలివచ్చామన్నారు. కాగా, ఈ నెల 17న చిత్తూరులో తలపెట్టిన సభకు పోలీసులు కావాలనే అనుమతి నిరాకరించారని అమరావతి జేఏసీ నేత శివారెడ్డి అన్నారు. ముందస్తుగానే దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తోందన్నారు. దీనిపై హైకోర్టుకెళ్లి తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 15, 16వ తేదీల్లో తిరుమల శ్రీవారిని రైతులు దర్శించుకోనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/