మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య వై ప్లస్ భద్రత

సల్మాన్ ఖాన్ తరహాలో ఆమెకు కూడా భద్రత పెంచిన ప్రభుత్వం

maharashtra-dy-cms-wife-amruta-fadnavis-gets-y-plus-security-in-light-of-threats

చండీగఢ్: పంజాబ్ కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు వై ప్లస్ భద్రత కల్పించిన కొన్ని గంటల తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్‌కు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అదే తరహా భద్రత కల్పించింది. మహారాష్ట్ర పోలీసుల రక్షణ, భద్రతా విభాగం ద్వారా ముప్పు అవగాహనను విశ్లేషించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

సల్మాన్ ఖాన్ సెక్యూరిటీని ఎక్స్ నుంచి వై ప్లస్ కి పెంచారు. అన్ని సమయాల్లో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్ వెంట ఉంటారు. అంతేకాకుండా ఆయన నివాసంలో 24 గంటలూ ఇద్దరు గార్డులు పహారా కాస్తారు. సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు రావడంతో ముంబై పోలీస్ ప్రొటెక్షన్ బ్రాంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ కు ఇచ్చే భద్రతను ఇప్పుడు అమృతా ఫడ్నవీస్ కు కూడా అందిస్తారు. అదనంగా ట్రాఫిక్ క్లియరెన్స్ వాహనం కూడా అమృత ప్రయాణిస్తున్న దారిలో అందుబాటులో ఉంచుతారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృత బహుముఖ ప్రజ్ఞాశాలి. గతంలో బ్యాంకర్ గా పని చేసిన ఆమె నటి, సింగర్, సామాజిక కార్యకర్త కూడా. ఆమె తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదివరకు దేవేంద్రతో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల మహారాష్ట్రలో అధికారం చేతులు మారింది. ప్రతిపక్షంలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఫడ్నవీస్ కుటుంబానికి కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలోనే ఆయన భార్యకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉండటంతో బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ కు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/