‘మహాభారత్’ సీరియల్లో భీముని పాత్రధారి ప్రవీణ్ క‌న్నుమూత‌

కార్డియాక్ అరెస్ట్ తో మృతి

న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ‘మహాభారత్’ సీరియల్ లో భీముడి పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించిన ప్రవీణ్ కుమార్ సోబ్తి మృతి చెందారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన చనిపోయారు. ఢిల్లీలోని అశోక్ విహార్ లో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి 10 – 10.30 గంటల మధ్య ఆయన మృతి చెందారు. చాలా కాలంగా ఆయన ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆయన చాలా ఇబ్బందికి గురి కావడంతో డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ప్రవీణ్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన ఒక గొప్ప అథ్లెట్ కూడా. పలు ఈవెంట్లలో ఆయన హ్యామర్ థ్రో, డిస్కస్ థ్రో విభాగాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఏసియన్ గేమ్స్ లో ఆయన నాలుగు పథకాలు సాధించారు. 1966, 1970 పోటీల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. 1966లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో హ్యామర్ థ్రోలో సిల్వర్ మెడల్ సాధించారు. అథ్లెట్ గా ఎంతో సాధించిన ఆయన ఆ తర్వాత యాక్టర్ గా మరింత పాప్యులారిటీని సొంతం చేసుకున్నారు. 1988లో బీఆర్ చోప్రా నిర్మించిన ‘మహాభారత్’ సీరియల్ తో ఆయన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించారు. ఆయనకు భార్య, కూతురు, ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరి ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/