వంట గ్యాస్ సిలిండ‌ర్ ధరల పెంపు

సిలిండర్‌పై రూ.25.50 పెంపు..ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి

న్యూఢిల్లీ : రోజురోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్యునికి ఇప్పుడు వంటగ్యాస్ మరింత భారంగా పరిణమించింది. ప్రభుత్వ చమురు సంస్థలు వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.25.50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆరు నెల‌ల్లో 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధర రూ.140 పెరిగింది. దీంతో ఢిల్లీ, ముంబైలో మే 1 నుంచి 809 రూపాయ‌లుగా ఉన్న 14.2 కిలోల సిలిండర్ ధర రూ.834.50కి చేరింది.

చెన్నైలో అత్య‌ధికంగా రూ.850.50గా 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధ‌ర ఉంది. మే 1 నుంచి నిన్న‌టివ‌ర‌కు అక్క‌డ సిలిండర్ ధ‌ర 825 రూపాయ‌లుగా ఉంది. కోల్‌క‌తాలో మే 1 నుంచి రూ.835గా ఉన్న సిలిండ‌ర్ ధ‌ర ఇప్పుడు 835.50 రూపాయ‌ల‌కు మాత్ర‌మే చేరింది. కాగా, 19 కిలోల‌ వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ.76 పెరిగింది. పెట్రోల్ ధ‌ర పెరుగుద‌ల‌తో ఇప్ప‌టికే ఇబ్బందులు ప‌డుతోన్న సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధ‌ర‌ల రూపంలో మరో పిడుగు పడుతోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/