భారత్​ కు మరో కాంస్య పతకం

బాక్సింగ్​ సెమీస్​ లో ఓడిన లవ్లీనా

టోక్యో: భారత ఖాతాలో మరో ఒలింపిక్స్ పతకం చేరింది. ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల వెల్టర్ వెయిట్ (64–69 కిలోలు) విభాగంలో బరిలో నిలిచిన ఆమె.. సెమీ ఫైనల్ లో ఓడిపోయింది. ఇవాళ జరిగిన బౌట్ లో టర్కీకి చెందిన బిజినెజ్ సర్మినెలి చేతిలో ఓటమిపాలైంది. జడ్జిలంతా ఏకగ్రీవంగా బిజినెజ్ ను విజేతగా ప్రకటించారు.

వాస్తవానికి మొదటి రౌండ్ నుంచే ప్రత్యర్థి బిజినెజ్ పంచ్ ల వర్షం కురిపించింది. 5–0తో ముందంజ వేసింది. తర్వాతి రౌండ్ నుంచి బోర్గోహెయిన్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఏకగ్రీవంగా బిజెనెజ్ ను విజేతగా ప్రకటించారు. ఫలితంగా గెలుపోటములతో సంబంధం లేకుండా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని గెలిచింది.

కాగా, విజేందర్ సింగ్, మేరీకోమ్ తర్వాత భారత్ కు ఒలింపిక్స్ పతకాన్ని అందించిన మూడో బాక్సర్ గా లవ్లీనా చరిత్ర సృష్టించింది. కాగా, కంచు పతకం సాధించిన లవ్లీనాను ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. దేశం మొత్తం గర్విస్తోందన్నారు. ఆమె విజయం ప్రతి భారతీయుడిలోనూ స్ఫూర్తి నింపుతుందన్నారు.

ఈ టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా గెలిచిన మూడో మెడ‌ల్ ఇది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వ‌ర్‌, బ్యాడ్మింట‌న్‌లో సింధు బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇప్పుడు బాక్సింగ్‌లో ల‌వ్లీనా బోర్గోహైన్ మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ తీసుకొచ్చింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/