లఖింపూర్ ఖేరీ ఘటన పై విపక్షాల ఆందళన..లోక్సభ వాయిదా
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాకాండపై సిట్ సంచలన విషయాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో భాగమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభలో ఇవాళ విపక్ష సభ్యులు ఆ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. స్పీకర్ బిర్లా ఎంత వారించినా వాళ్లు వినలేదు. సభ్యులు మాస్క్ ధరించి తమ నిరసన వ్యక్తం చేయాలని మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. అయితే విపక్ష సభ్యులు పట్టించుకోలేదు.
నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ బిర్లా సభను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అంతకముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని తన తీర్మానంలో కోరారు. మరో వైపు 12 మంది ఎంపీలపై విధించిన వేటును ఎత్తివేయాలని కోరుతూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సభను 12 గంటల వరకు చైర్మెన్ వాయిదా వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/