నెల్లూరు జిల్లాలోని ఆసుపత్రిలో దారుణ ఘ‌ట‌న‌పై లోకేశ్ విమ‌ర్శ‌లు

అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా? అని నిల‌దీత‌

అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇటీవ‌ల‌ చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా, తండ్రి ఆ మృతదేహాన్ని బైక్ పై 90 కిమీ తీసుకెళ్లాల్సి వచ్చిన విష‌యం తెలిసిందే. రుయా ఆసుపత్రిలో జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌క‌ముందే పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. శ్రీ‌రామ్ (8) అనే బాలుడి మృత‌దేహాన్ని బైక్‌పై త‌ర‌లించారు. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

‘రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశాం. విశాఖ కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో ఒక కుటుంబం పై తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూసి షాక్ అయ్యాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం రూ.15 వేలు డిమాండ్ చేశారు సిబ్బంది. ఎవరూ సహాయం చెయ్యని దయనీయ పరిస్థితిలో బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృత దేహాన్ని తరలించాడు ఆ తండ్రి. పబ్లిసిటీ పిచ్చితో మీరు జెండా ఊపిన వాహనాలు అన్నీ ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి గారు?

సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ నిర్వహణ మీ ఏ2 సాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా?” అని నారా లోకేశ్ నిల‌దీశారు. ఆ బాలుడిని ద్విచ‌క్ర వాహ‌నంపై త‌ర‌లిస్తోన్న ఫొటోను ఈ సంద‌ర్భంగా నారా లోకేశ్ పోస్ట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/