మీ రాజధాని ఏది? అని దావోస్లో జగన్ను ప్రశ్నిస్తే ఏం చెబుతారు?
జగన్ చూపించిన మూడేళ్ల సినిమా అయిపోయిందన్న లోకేశ్
అమరావతి: సీఎం జగన్ దావోస్ లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై విజయవాడలో టీడీపీ నేత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ… మీ రాజధాని ఏది? అని దావోస్లో జగన్ను ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చెబుతారు? అని ప్రశ్నించారు. దావోస్ లో అదానీని తప్ప ఇంక ఎవరినీ జగన్ కలవలేదని, అదానీని కలవడానికి దావోస్ వరకు వెళ్లే అవసరం ఏముంటుందని ఆయన అన్నారు.
ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తారా? అని ఆయన నిలదీశారు. చట్టాలను ఉల్లంఘించి దొంగ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని స్పష్టం చేశారు. జగన్ చూపించిన మూడేళ్ల సినిమా అయిపోయిందని ఇక ఆయన ఇంటికే వెళతారని అన్నారు.
ప్రజలను పన్నుల పేరుతో పీడించి నరకం చూపించారని ఆయన అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు చాలా మంది ప్రముఖులను కలిశారని, సజ్జలను కూడా కలిశారని చెప్పారు. అయితే, పోలీసులకు మాత్రం అనంతబాబు కనిపించలేదట అంటూ ఎద్దేవా చేశారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో సీబీఐ విచారణ జరగాల్సిందేనని లోకేశ్ డిమాండ్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/