పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు : లోకేశ్

సొమ్మును కాజేస్తున్నారంటూ మండిపాటు

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తే గ్రామాల రూపు రేఖలు మారుస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు ఏకంగా పంచాయతీల ఖాతాల్లో ఉన్న సొమ్మును కాజేస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. వ్యవస్థల విధ్వంసానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నామన్నారు.

14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల నుంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేశారని, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లనూ పక్కదారి పట్టించారని ఆరోపించారు. అది గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చేయడమేనని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరుణంలో.. ఖాతాల నుంచి సొమ్మును తీసేసుకుంటే వారు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే పంచాయతీల సొమ్మును ఖాతాల్లో వేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/