వారం రోజులు నాగ్​ పూర్​ లో పూర్తి లాక్​ డౌన్​

ఈ నెల 15 నుంచి 21 వరకు ఆంక్షలు

నాగ్ పూర్ : కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది. కిరాణా, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటినీ మూసేస్తున్నట్టు వెల్లడించింది.

నాగ్ పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నాగ్ పూర్ కు చెందిన మంత్రి నితిన్ రౌత్ గురువారం దీనిపై అధికారిక ప్రకటన చేశారు. కాగా, సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున నాగ్ పూర్ లో తొలి కరోనా కేసు నమోదు కావడం.. మళ్లీ అదే రోజున మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,854 కరోనా కేసులు నమోదైతే.. ఒక్క మహారాష్ట్రలోనే 13,659 మందికి పాజిటివ్ గా తేలింది. మొత్తం కేసుల్లో 60 శాతానికిపైగా అక్కడే వస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లోనే 85 శాతం కేసులు నమోదవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/