మనుషుల నుంచి మూడు సింహాలకు కరోనా

15 రోజులపాటు దగ్గు, ఆయాసం, ముక్కు కారడం వంటి లక్షణాలు

దక్షిణాఫ్రికా : దక్షిణాఫ్రికాలోని ఓ జూలో మూడు సింహాలు కరోనా బారినపడ్డాయి. మనుషుల ద్వారానే వీటికి వైరస్ సంక్రమించి ఉంటుందని నిర్ధారించారు. గౌటెంగ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు జూలో లక్షణాలు లేని వ్యక్తుల ద్వారా వీటికి వైరస్ సోకినట్టు గుర్తించారు. కొవిడ్ బారినపడిన సింహాలు దగ్గు, ఆయాసం, ముక్కు కారడం వంటి లక్షణాలతో 15 రోజులపాటు బాధపడినట్టు ప్రిటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

గతేడాది చివర్లో దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఇది జరిగింది. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాలు ‘వైరసెస్’ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. సింహాలు కరోనా బారిన పడిన ఏడు వారాల తర్వాత నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులోనూ పాజిటివ్‌గానే నిర్ధారణ అయింది. ఇవి ఐదు నుంచి 15 రోజుల పాటు పొడిదగ్గుతో బాధపడగా, రెండు సింహాలు మాత్రం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డాయి. మొత్తంగా 25 రోజుల్లో సింహాలన్నీ కొవిడ్‌ను జయించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/