‘ది వారియర్’ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష

‘ది వారియర్’ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది చెన్నైలోని సైదాపేట్ కోర్టు. చెక్ బౌన్స్ కేసులో లింగుస్వామికి ఈ శిక్ష విధించింది. తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లింగుస్వామి.. కొన్ని సంవత్సరాల క్రితం కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ సినిమాస్ నుంచి అప్పు తీసుకున్నారు.

అయితే, ఆ సినిమా సెట్స్ పైకి రాకపోవడంతో పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న సొమ్మును చెక్కు రూపంలో తిరిగి చెల్లించారు. వారిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. నిన్న ఈ కేసు విచారణకు రాగా లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్‌లకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సైదాపేట్ కోర్టు తీర్పుపై లింగుస్వామి సోదరులు అప్పీలుకు వెళ్లనున్నారు. ఇటీవలే లింగుస్వామి.. రామ్ తో ‘ది వారియర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది.