ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం
‘లైగర్’ యూనిట్ ప్రకటన: టీజర్ విడుదల వాయిదా
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్జోహార్, చార్మీల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్: సాలా క్రాస్బీడ్’ సినిమా టీజర్ కాస్త ఆలస్యంగా విడుదల కానుంది. హీరో విజయ్ దేవరకొండ జన్మదినం సందర్భంగా ఈ ఆదివారం (మే 9) ‘లైగర్’ టీజర్ విడుదల అవుతుందని విజయ్ దేవరకొండ అభిమానులు, సినీ లవర్స్ ఆశించారు. ‘లైగర్’ చిత్రబృందానికి కూడా టీజర్ను విడుదల చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నప్పటికీని, ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలోని విపత్కర పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ‘లైగర్’ సినిమా టీజర్ విడుదలను వాయిదా వేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులు సద్దుమణిగి, ప్రజలు ఆనందంగా ఉన్న తరుణంలోనే ‘లైగర్’ టీజర్ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ‘లైగర్’ చిత్ర బృందం ప్రకటనను విడుదల చేసింది.
‘‘ఈ ఆందోళనకర పరిస్థితుల్లో, ఈ కష్టసమయంలో మీరు, మీ కుంటుంబసభ్యులు క్షేమంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఇంట్లోనే ఉంటూ మీ ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాం. తీసుకోవాలని వేడుకుంటున్నాం.
మే 9న ‘లైగర్’ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ టీజర్ను విడుదల చేయాలని మేం అందరం అనుకున్నాం. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్న ఈ తరుణంలో ‘లైగర్’ టీజర్ను విడుదల చేయాలని అనుకోవడం లేదు. అందుకే వాయిదా వేశాం. ఈ క్లిష్ట సమయాలు వెళ్లిపోయాక ‘లైగర్’ టీజర్ను మీ ముందుకు తీసుకువస్తాం.
టీజర్ విడుదలైన తర్వాత ‘లైగర్’ చిత్రంలోని విజయ్ దేవరకొండ లుక్కి, ఫెర్మార్మెన్స్కి ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు. టీజర్ విడుదల కానుందుకు ఇప్పుడు నిరుత్సాహపడ్డవారు ఆ క్షణం డబుల్ హ్యాపీతో ఉంటారు.
అప్పటివరకు దయచేసి అందరు ఇంట్లోనే ఉండండి. మీ, మీ ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. బాధ్యతగా ఉండండి. ఒకరికొకరం సాయం చేసుకుంద్దాం. వీలైనంత తొందరగా వ్యాక్సిన్ వేయించుకుంద్దాం. కోవిడ్ జాగ్రత్తలను, వైద్యుల సలహాలను పాటిద్దాం. కరోనాపై అందరం సమష్టిగా పోరాడదాం. త్వరలో థియేటర్స్లో కలుద్దాం… అంటూ మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/