హాస్పటల్ ఓపెనింగ్ జరిగిన క్షణాల్లో ప్రమాదం

హైదరాబాద్ శివారు శంషాబాద్ లో నూతనంగా ప్రారంభమైన హాస్పటల్..ఓపెనింగ్ జరిగిన కాసేపటికే ప్రమాదానికి గురి అయ్యింది. అంతే ఈ ప్రమాదం నుండి తృటిలో మంత్రి హరీష్ రావు తప్పించుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

శంషాబాద్ ఏరియాలో కొత్తగా ఓ హాస్పిటల్‌ నిర్మాణం జరిగింది. ఆదివారం ఈ హాస్పటల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా మంత్రి హరీశ్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. రాజకీయనేతలు, ప్రముఖుల చేత గ్రాండ్ గా ప్రారంభమైంది. ప్రారంభించిన అనంతరం నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆస్పత్రిలో పెను ప్రమాదం జరిగింది.

హాస్పటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ప్రజాప్రతినిధులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంత్రి హరీశ్, ఎంపీ, ఎమ్మెల్యే అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతిథుల వెంట వచ్చిన కార్యకర్తలు లిఫ్ట్‌లో ఉండగా ప్రమాదం జరిగింది. లోడ్ ఎక్కువ కావడంతోనే లిఫ్ట్ కూలినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది టెక్నికల్ టీమ్ సాయంతో లిఫ్ట్‌ని తెరిచి అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో అదే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.