ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీవో

రెండు గంటల్లోనే 28 శాతం సబ్ స్క్రైబ్ అయింది


ముంబయి: ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూ ( LIC IPO) ప్రారంభమైంది. ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు ఎంతో మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఐపీవో ఆరంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,620 కోట్లను ఎల్ఐసీ సమీకరించింది. ఈ ఇష్యూలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయిస్తోంది. ఈ రూపంలో రూ.20,557 కోట్లను సమకూర్చుకోనుంది.

ఇష్యూ ఆరంభమైన మొదటి రెండు గంటల్లోనే (మధ్యాహ్నం 12 గంటలకు) పాలసీదారులకు కేటాయించిన కోటా మేరకు పూర్తి బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోటాలో 48 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 31 శాతానికి సమానమైన బిడ్లు వచ్చాయి. మొత్తం మీద 28 శాతం ఇష్యూకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి.

మొత్తం 22.13 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయిస్తోంది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. పాలసీదారుల కోటా కింద 10 శాతం రిజర్వ్ చేశారు. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.902-949. ఒక లాట్ కింద కనీసం 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాలసీదారులకు ఇష్యూ ధరపై రూ.60 డిస్కౌంట్, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఇష్యూ ఈ నెల 9న ముగియనుంది. 17న స్టాక్ ఎక్సేంజ్ లలో ఎల్ఐసీ లిస్ట్ కానుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/