ఇక శాసనమండలి ఎన్నికల పోరు!
ఉత్తములను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది
ఈ మధ్యనే దుబ్బాక ఉప ఎన్నిక పోరు ముగిసింది.
తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు, ఆపై ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ రెండు స్థానాలలో గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికల పోరు కొనసాగనుంది.
ఇప్పటికే సెప్టెంబర్ 23న ఎన్ని కల కమిషన్ షెడ్యూల్ ప్రకటించి అక్టోబర్ ఒకటి నుండి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించి నవంబర్ ఆరువరకు గడువునిచ్చి, అభ్యర్థన మేరకు మరల డిసెంబర్ ఒకటి నుండి 31 వరకు మరొ కసారి అవకాశం కల్పించనుంది.
జనవరి 18న తుదిజాబితా విడ ుదల చేసి తర్వాతి తతంగాన్ని పూర్తిచేయనుంది.
నల్గొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ శాసనమండలి నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ నుండి రాంచందర్రావు పదవీకాలం 2021 మార్చి 29న ముగుస్తుండటంతో ఈ దఫా ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది.
ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను మిగతా పార్టీలు సద్వినియోగం చేసుకోవాలనిదలిచి ఇప్పటికే అంతర్గతంగా ప్రచార కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య సైతం పెరగనుంది.
ఈసారి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సైతం ఓట్ల నమోదు ప్రక్రియలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం, ఒక్క వరంగల్ ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఆన్లైన్ ద్వారా 4,13,475, ఆఫ్లైన్ ద్వారా 1,04,068 మొత్తం 5,17,543 మంది ఓటు నమోదు చేసుకున్నారు.
ఇంకా డిసెంబర్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. అధికార పార్టీ గత ఆరు సంవత్సరాల పాలనలో నిరుద్యోగ నిర్మూలనలో విఫలం అయింది.
అందుకే చదువుకున్న ప్రతి ఒక్కరిలో పాలకవర్గంపై వ్యతిరేక భావనతో ఉండటం జరిగింది.
అందుకే దుబ్బాక ఉప ఎన్నికలలో ఇచ్చిన తీర్పుయే నిదర్శనం. శాసనమండలిలో జరగ బోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో సైతం అందరూ చదువ్ఞకున్న నిరుద్యోగులే ఉంటారు.
నేటి ఫలితం సైతం అధికార పార్టీకి చెంపపెట్టుగా మారనుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు.
ఇదియేకాకుండా మున్సిపాలిటీ ఎన్నికలలో సైతం ఆ ప్రభావం పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంపైన వ్యతిరేకత నెలకొంటున్నదన్నది ముమ్మాటికి వాస్తవం.
అయినప్పటికీ దుబ్బాక ఉప ఎన్నికలలో పార్టీల పరంగానే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు పదుల సంఖ్యలో పోటీలో నిలబడి ఓట్లను చీల్చడంలో ఒకింత విజయం సాధించారని చెప్పవచ్చు.
అందులో భాగంగానే గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలలో సైతం పోటీలో నిలబడే అభ్యర్థుల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉన్నది.
అందుకే ఎవరికి వారు ముందస్తుగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, ఓటర్లను ఆకర్షింప చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడం జరు గుతుంది.
ఇంకా ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేయకుండా పరిస్థితులను గమనిస్తూ ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొని, ఈ దఫా ఎక్కువ ఓటర్లను నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీకి ఎదురు గాలి వీయనుందా?
ఎందుకంటే 2014 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమపార్టీ, ఉద్యమ సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో కలలుగని, కలలసాకారం చేసుకోవడానికి అధికారాన్ని అందించి, కోటి ఆశలతో ఎదురుచూసినా ఫలితం లేకుండాపోయింది.
కేవలం వారు చేపట్టే అభివృద్ధి పథకాలు సైతం ధనార్జన నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఓట్ల రాజకీయంగానే కొనసాగాయి తప్పా నిరుద్యోగుల పాలిట శాపంగా మారి, వారి జీవన విధానమే ప్రశ్నార్థకంగా మారిందనడంలో నిజం లేకపోలేదు.
గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటువేసే అభ్యర్థులందరూ నిరుద్యోగులు కావడంతో తమ పగ తీర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు.
కానీ సంఘాల వారిగా ఎవరికి వారు ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి ఓట్లను చీల్చి అధికార పార్టీకి మేలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదిఏమైనప్పటికీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొన్న మాటవాస్తవం.
గత ఆరు సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగ అవకాశాల మాటనీటిమూటగా తయారైంది.
తినడానికి తిండి లేదన్న వాడికి బిర్యానీ పెడతామని ఊరించే విధంగా రెండుపడక గదుల ఇల్లు అని చెప్పి ఇంటి జాగలను కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలా చెప్పుకుంటూపోతే పరిష్కారం దొరకని ఎన్నో సమస్యలున్నాయి.
ఇదిగాక ప్రతిపక్షం లేకుండా చేసి, ప్రశ్నించే గొంతులను నొక్కివేసే ప్రయత్నాలు జరుగుతున్నా యి. అధికారపక్షంలో సైతం ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా వారందరూ ఉత్సవ విగ్రహాలుగా మారినారు తప్పా వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.
నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి పరస్పర అంగీకారంతో చర్చించి, ఒక్కటై ముందుకెళితే ప్రయో జనం పొందే అవకాశం ఉంటుంది.
అంతేగాని ఇద్దరూ కొట్లాడితే మూడోవాడికి లాభం చేకూర్చేలా అన్నట్లుగా కాకుండా తెలివిగా ముందుకు వెళ్లాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది.
అందుకే తగిన జాగ్రత్తలతో వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికైనా నిరుద్యోగ నిర్మూలనకు పాటుపడుతూ, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపడుతూ వారి మన్ననలు పొందాలి. ఈ
శాసన మండలి ఎన్నికలలో ఓటువేసే ప్రజలందరూ మేధావులు, సమాజంలో ఏం జరుగుతుందో, పాలకుల వైఖరి ఏంటో ఎప్పటికప్పుడు విశ్లేషించే నైపుణ్యం కలవారు.
కావున డబ్బుకు అమ్ముడుపోకుండా సరైన సమయంలో ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకొని ఉత్తమ వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆ దిశగా అడుగులు వేసి, తీర్పును చెప్పాలి. గతంలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయే ప్రతి ఎన్నికలు ఆసక్తికరంగా మారే అవకాశాలున్నాయి.
ఓటర్లు సైతం చైతన్యమై, ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ తీర్పును ఎలా ఇస్తారో ఊహించలేని విధంగా మారుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు.
ఏదిఏమైనప్పటికీ ఓటర్లకు తమ చేతిలో ఉన్న ఓటు అనే వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ అభ్యర్థులను ఎన్నుకోవాలి.
- డా. పోలం సైదులు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/