అర్ధరాత్రి ఎల్బీనగర్​లో పేలుళ్లు కలకలం

శుక్రవారం అర్ధరాత్రి ఎల్బీనగర్​లో పేలుళ్లు కలకలం రేపాయి. బండరాళ్లను తొలగించేందుకు నిర్మాణ సంస్థ పేలుళ్లు జరపడంతో స్థానికుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఎల్బీనగర్‌లోని కృష్ణనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల శబ్దాలకు స్థానికులు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తమ ఇళ్లను ఆనుకుని ఉన్న స్థలంలో ఓ నిర్మాణ సంస్థ బండరాళ్లను గత కొంత కాలంగా పగలగొడుతోందని.. ఇందుకోసం పేలుళ్లు జరుపుతున్నట్టు స్థానికులు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి భారీ శబ్దాలతో మరోసారి పేలుళ్లు జరిపారని దీంతో బండరాళ్లు గాలిలోకి ఎగిరి తమ ఇళ్ల పై వచ్చి పడ్డాయని తెలిపారు.

దీంతో పలు ఇళ్ల కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయని వాపోయారు. అదృష్టవశాత్తు ఇళ్ల బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. రాత్రి పూట ఇలా పేలుళ్లు జరపడం ఏంటి అని ప్రశ్నించారు. ధ్వసమైన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. స్థానికులు విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.