రాజ్యసభ ఎంపీగా కె.లక్ష్మణ్ ప్రమాణం ..పార్లమెంటు మెట్లకు దండం
యూపీ కోటా నుంచి సీటు ఇచ్చిన బీజేపీ
న్యూఢిల్లీః బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ… రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ వాదనను వినిపించడానికి యూపీ నుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జాతీయ నాయకత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్నానని.. తనకు దక్కిన రాజ్యసభ అవకాశం కార్యకర్తలకు దక్కిన గుర్తింపు అని ఎంపీ చెప్పుకొచ్చారు.
కాగా, పార్లమెంటు భవనంలోకి ఎంపీ హోదాలో తొలిసారిగా అడుగుపెట్టిన సందర్భంగా లక్ష్మణ్ పార్లమెంటు భవన్ మెట్లకు దండం పెట్టారు. ఈ ఫొటోలను ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/