ముగియనున్న లాక్డౌన్..సిఎం కీలక వ్యాఖ్యలు
ఇకపై ప్రజలదే బాధ్యతని, వారే కరోనా వ్యాపించకుండా చూసుకోవాలి
బెంగళూరు: ఈరోజుతో బెంగళూరు లో సంపూర్ణ లాక్ డౌన్ ముగియనుంది. ఈనేపథ్యంలో సిఎం యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాని కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రనక, పగలనక పనిచేసిందని, ఇకపై ప్రజలదే బాధ్యతని, వారే కరోనా వ్యాపించకుండా చూసుకోవాలని ఆయన వెల్లడించారు. వైరస్ కట్టడి ఇక తమ చేతుల్లో ఏమీలేదని అన్నారు.
కాగా, జూలై 14 నుంచి నగరంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కేసులు తగ్గలేదు. ఇప్పటివరకూ బెంగళూరులో 33 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. ‘నేను ఒకటే చెప్పదలచుకున్నాను. ఇక బెంగళూరులో లాక్ డౌన్ ఉండదు. రాష్ట్రంలోనూ అమలు కాబోదు. కేవలం కంటెయిన్ మెంట్ జోన్లలో మాత్రమే నిబంధనలు అమలవుతాయి. ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకరించాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
కాగా నగరంలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మౌలిక వసతులతో పోలిస్తే, ఇప్పుడున్న కేసుల సంఖ్య ప్రభుత్వంపై ఒత్తిడిని పెట్టడం లేదని ఆయన అన్నారు. కేవలం అంబులెన్స్ ల విషయంలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/